ఇదేనిజం, నేషనల్ బ్యూరో: ఇటీవల సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్, ప్రియాంకా ఖర్గేపై కేసు నమోదైంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉదయనిధి స్టాలిన్పై యూపీలో కేసు నమోదైంది. ఆయనకు మద్దతు ఇచ్చినందుకు మరో కేసు నమోదైంది. ఉదయనిధితో పాటు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల కారణంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హర్ష గుప్తా, రామ్ సింగ్ లోధి అనే ఇద్దరు న్యాయవాదులు వారిపై రాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. ఇదే అంశంపై బెంగళూరు దక్షిణ జిల్లా భాజపా అధ్యక్షుడు ఎన్ఆర్ రమేశ్ ఫిర్యాదు మేరకు బనశంకరి ఠాణాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. తమిళనాడులోని ఒక కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి స్టాలిన్ వేదికపై సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై భాజపా శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.