అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పేదలకు ఇండ్ల ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది.
డిసెంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా, లాక్డౌన్, కోర్టు కేసులతో ఇప్పటికే పలుమార్లు ఈ కార్యక్రమం వాయిదా పడిన విషయం తెలిసిందే.
స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు సీఎం జగన్ స్పష్టం చేశారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
డి-ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించాలని, పట్టాల పంపిణీ ప్రారంభించిన రోజే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. తొలిదశలో దాదాపు 15లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
దాదాపు రూ.23 వేల కోట్ల విలువైన భూములను పేదలకు పంచుతున్నట్లు పేర్కొన్నారు. కోర్టు కేసులు లేని చోట్ల పంపిణీకి సన్నాహాలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.