– స్టీల్ బ్రిడ్జ్ ఘటనపై తలసాని రియాక్షన్
ఇదేనిజం, హైదరాబాద్: ఇటీవల స్టీల్ బ్రిడ్జ్ మీద జరిగిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. తన పొరపాటును క్షమించాలంటూ కోరారు. “నేను పొరపాటు చేశా, నన్ను క్షమించండి. నాకు భేషజాలేమీ లేవు, పొరపాటు జరిగింది కాబట్టి బేషరతుగా క్షమాపణ అడుగుతున్నా. ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబునే కాదు, గిరిజన బిడ్డలందర్నీ క్షమించమని అడుగుతున్నా.” అంటూ ఓ వీడియో విడుదల చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని ఓ వ్యక్తిని చొక్కా పట్టుకుని వెనక్కు లాగి చేయి చేసుకున్న వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనలో బాధితుడు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుగా తేలింది. దీంతో గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తలసానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. తలసాని క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. వారి ఆందోళన కారణంగా మంత్రి తలసాని మీడియా ముందుకొచ్చారు. ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబుకి క్షమాణ చెబుతున్నట్టు ప్రకటించారు. స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మంత్రి కేటీఆర్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ఆ తోపులాటలో అనుకోకుండా రాజేష్, మంత్రి తలసాని శ్రీనివాస్ కాలు తొక్కారు. గాయం కారణంగా రక్తం వచ్చిందని చెబుతున్న తలసాని, ఆ సందర్భంలో బాధతో తాను అలా ప్రవర్తించానన్నారు. అయితే తాను చేసింది పొరపాటేనని ఒప్పుకున్నారు. రాజేష్ స్థానంలో ఎవరున్నా తాను అలా చేసి ఉండకూడదన్నారు. సోషల్ మీడియాలో ఇదంతా కనపడలేదని, కేవలం తాను చొక్కా పట్టుకుని వెనక్కు లాగిన విషయమే హైలైట్ అయ్యిందని తలసాని పేర్కొన్నారు.