ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ తాజాగా విడుదలైంది. దాదాపు 10 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాల వివరాలను అధికారికంగా ప్రకటించారు. హాలీవుడ్ చిత్రాలు ‘బార్బీ’, ‘ఓపెన్హైమర్’ ఎక్కువ విభాగాల్లో పోటీ పడుతున్నాయి. ఇక, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో భారత్ నుంచి అధికారికంగా ఎంపికైన మలయాళ సినిమా ‘2018’ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఆస్కార్ పోటీలో ఈ సినిమా లేకపోవడంపై సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు. యూకేకు చెందిన ‘ది జోన్ ఆఫ్ ఇంట్రస్ట్’, డెన్మార్క్కు చెందిన ‘ది ప్రామిస్డ్ ల్యాండ్’, జపాన్కు చెందిన ‘పర్ఫెక్ట్ డేస్’ చిత్రాలు ఈ కేటగిరిలో ముందున్నాయి. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంతో పాటు, ఇతర భాషల్లోనూ ఈ సినిమా మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. టోవినో థామస్ ప్రధాన పాత్రలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ దీనిని తెరకెక్కించారు. ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన కమిటీ.. సెప్టెంబర్లో ఈ సినిమాను ఎంపిక చేసి అధికారికంగా ఆస్కార్కు పంపింది.