– ప్రవళిక తల్లి విజయ డిమాండ్
– మా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దంటూ విజ్ఞప్తి
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తన బిడ్డ చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలని మర్రి ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేసింది. మీ రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగకండి.. మమ్మల్ని టార్చర్ పెట్టకండి అని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘రెండేళ్ల నుంచి ప్రవళికను హైదరాబాద్లో చదివిస్తున్నా. నా కొడుకు కూడా అక్కడే చదువుకుంటున్నాడు. ఎండల కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నాం. మా పిల్లలకు ఆ కష్టం రాకూడదు అని అక్కడ పంపి చదివిపిస్తున్నాం. కానీ, వాడు మా పిల్లను వేధించాడు. వాడి టార్చర్ భరించలేక మా అమ్మాయి కనీసం మాతో కూడా చెప్పుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చేయాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రాకూడదు. మీకు పార్టీల పరంగా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూస్కోండి అంతే కానీ మా కుటుంబాన్ని అందులో లాగకండి. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని మాత్రం బయటకు రానీయకండి.. వాడికి శిక్ష వేయండి’ అని ప్రవళిక తల్లి విజయ డిమాండ్ చేసింది.
అక్క ఆత్మహత్యకు శివరామే కారణం: ప్రవళిక సోదరుడు కుమార్
తన సోదరి ఆత్మహత్యకు శివరామే కారణమని ప్రవళిక తమ్ముడు కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అక్క హాస్టల్కు నేను కొంచెం దూరంలోనే ఉంటాను. ఐదు నిమిషాల్లోనే అక్క హాస్టల్కు చేరుకుంటాను. వారానికి మూడు నాలుగు సార్లు కలిసి మాట్లాడుకుంటాం. అక్క చనిపోవడానికి కారణం శివరామ్ అనే వ్యక్తి. వేరే అమ్మాయి వల్ల పరిచయమయ్యాడు. అప్పటి నుంచి అక్కకు ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడడం, కాల్ చేయడం, హాస్టల్కు వచ్చి అందరి ముందు మాట్లాడమని ఇబ్బంది పెట్టేవాడు. అక్కకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఖరికి అమ్మకు, నాన్నకు , నాకు.. ఎవరికి చెప్పిన ఏమంటారో, ఏం సమస్య వస్తుందో ఇంట్లో అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. అక్కకు న్యాయం జరగాలంటే శివరామ్ ఎక్కడ ఉన్న పట్టుకుని అతడికి ఉరిశిక్ష విధించాలి’ అని ప్రవళిక తమ్ముడు కుమార్ డిమాండ్ చేశాడు.