ఇదే నిజం, హైదరాబాద్: రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 28న విచారణ చేపడతామని తెలిపింది. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. ‘వ్యూహం’ ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్కల్యాణ్ నచ్చరని చెప్పారని లోకేశ్ పిటిషన్లో పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి తెరవెనక ఉండి ఈ సినిమా తీయించారన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రీజినల్ ఆఫీసు, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రాంగోపాల్ వర్మను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉంది.