– త్వరలో కేబినెట్ విస్తరించే చాన్స్
– రేవంత్కు అత్యంత సన్నిహితుడు కావడంతో అవకాశం
– ఢిల్లీ స్థాయిలో మంతనాలు
ఇదే నిజం ప్రతినిధి, వరంగల్: సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరగబోతున్న విషయం తెలిసిందే. మంత్రి వర్గంలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. కాగా రేవంత్ రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ వేం నరేందర్ రెడ్డి పేరు ప్రధానంగా తెరమీదకు వచ్చింది. నరేందర్ రెడ్డి మొదటి నుంచి రేవంత్ వెంబడి నడిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. దీంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా మరో ఆరుగురికి అవకాశం రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. వేం నరేందర్ రెడ్డి కోసమే అప్పట్లో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వేం నరేందర్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి అనుచరుడిగా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పనిచేశారు. అలాంటివేం నరేందర్ రెడ్డికే మంత్రి పదవి కటబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయమై పలుమార్లు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. మరి వేం నరేందర్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.