– ఐదుగురి మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు
– తమిళనాడులోని విరుధ్నగర్– మధురై నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: హైవేపై వెళ్తున్న ఓ కారు.. బైక్ను ఢీకొట్టి అదుపుతప్పింది. ఒక్కసారిగా నాలుగు లేన్ల హైవే అవతల ఉన్న సర్వీస్రోడ్ వరకు గాల్లో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని విరుధ్నగర–మధురై నేషనల్ హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం నేషనల్ హైవేపై ఓవర్ స్పీడ్తో వచ్చిన ఎస్యూవీ కారు తొలుత నెమ్మదిగా వెళ్తున్న బైక్ను ఢీకొట్టి అదుపుతప్పింది. అనంతరం ఎడమ వైపున్న డివైడర్ను బలంగా ఢీకొని గాల్లో పలుమార్లు పల్టీలు కొట్టింది. నాలుగు లేన్ల హైవేకు అవతలి వైపు సర్వీస్ లైన్లో ఎగిరిపడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం ధాటికి సంఘటనా స్థలంలో భారీగా దుమ్ము పేరుకుపోయింది. ఈ ఘటనలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా ముధురైలోని విల్లుపురానికి చెందినవారుగా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.