LIVE : తాను ఎవర్నీ మోసం చేయలేదనీ, ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదని కాంగ్రెస్ నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. నైతిక విలువలతో పాటు, ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకునే పార్టీ మారానని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. వరంగల్ లో బీఆర్ఎస్ క్యాడర్ నుంచి మద్దతు కరవైందని కేసీఆర్కు విన్నవించినా వినకుండా హడావిడిగా కడియం కావ్యకు టికెట్ కేటాయించారని చెప్పారు. సమయం కావాలి అని అడిగినా ఏం పట్టించుకోలేదని చెప్పారు. పార్టీ ఫిరాయింపుకు సంబంధించి ఏ సమస్యనైనా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు.
“దేశంలో బీజీపీని ఎదుర్కోవడమనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అందుకే కాంగ్రెస్లో చేరాను. మందకృష్ణ వల్లే ఎమ్మార్పీఎస్ బలహీనపడింది. దళిత నాయకులను ఆయన ఎదగనీయలేదు.
రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ ఇచ్చి అక్రమాలకు పాల్పడటం వల్లే ఆరూరి రమేశ్ ఓడిపాయారు. నేను అక్రమంగా ఎలాంటి ఆస్తులను సంపాదించలేదు. ఆధారాలు ఉంటే నిరూపించాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కాంట్రాక్టుల ద్వారా అవినీతికి పాల్పడ్డారు. పార్టీలో మనస్ఫూర్తిగా అభిప్రాయాలను చెప్పే అవకాశం ఎప్పుడూ లేదు. వ్యక్తిగతంగా నన్ను విమర్శించడానికే తాటికొండ రాజయ్యను బీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. రాజయ్య చేష్టలు, వ్యక్తిత్వం వల్లే ఆయన అథోగతి పాలయ్యారు. కేసీఆర్ మీద నాకు గౌరవం ఉంది. ఎన్నికల ఖర్చు కోసం కేసీఆర్ గానీ, హరీశ్ రావు గానీ 10 లక్షలు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కొందరు చేస్తోన్న విమర్శల్ని చూస్తే బాధేస్తోంది. రాజకీయ నాయకులు పరిధి దాటి మాట్లాడకూడదు. జర్నిలిజంలో విలువలు ఉంటాయి. వాళ్లు అన్న బూతు మాటలు ప్రసారం చేయవద్దు”.
-కడియం శ్రీహరి