మేడిగడ్డ పనులు నేడు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో మేడిగడ్డ బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సిఫారసులకు సంబంధించిన పనులను ఎల్అండ్టీ సంస్థ ప్రారంభించింది. బరాజ్లోని బ్లాక్-7లో 8 గేట్లను ఎత్తివేసేందుకు చర్యలు చేపట్టింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, అందుకు గేట్లను పూర్తిగా తెరచి ఉంచాలని, ఆటంకంగా మారిన ఇసుకమేటలు, రాళ్లను తొలగించాలని ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన పనులను చేట్టాలని బరాజ్ నిర్మాణ ఏజెన్సీకి ఇరిగేషన్శాఖ ఇటీవలనే ఆదేశాలను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సదరు ఏజెన్సీ మొత్తం 8 గేట్లలో ఇప్పటికే ఒక గేటును ఎత్తి పెట్టింది. మరో 2 మినహా మిగతా గేట్లను సైతం సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశముందని ఎల్అండ్టీ అధికారులు వెల్లడిస్తున్నారు. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దానిపక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడుతున్నది. బరాజ్కు దిగువన, ఎగువన పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తున్నది. రాఫ్ట్ కింద ఉన్న రంధ్రాలను ఇసుక, సిమెంట్తో గ్రౌటింగ్ చేసేందుకు, షీట్ పైల్స్ను వేసేందుకు సైతం సంసిద్ధమైంది.