Homeహైదరాబాద్latest Newsగణేశ్ నిమజ్జన శోభాయాత్రలో అర్ధరాత్రి ఉద్రిక్తత..!

గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో అర్ధరాత్రి ఉద్రిక్తత..!

ఇదే నిజం, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో మంగళవారం రాత్రి పాంచ్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత నెలకొంది. గణేశ్ నిమజ్జనం ఆలస్యం అవుతుందని పోలీసులు బ్యాండ్ మేళాలను పక్కకు తప్పిస్తూ విగ్రహాలను ముందుకు కదలనిచ్చారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో పోలీసులు యువజన సంఘాల నాయకులను చెదరగొట్టారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి తమపై లాఠీచార్జి చేశారంటూ యువజన సంఘాల నాయకులు ఆరోపించారు. లాఠీలతో కొట్టడంతోనే గాయాలయ్యాయని యువకులు తెలిపారు.

తాము చెదరగొట్టే ప్రయత్నంలో సంఘాల నాయకులు పరుగులు తీస్తూ కింద పడడంతో గాయాలపాలైనట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. భారీ విగ్రహాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని చెప్పారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. నిరసన అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు కొనసాగింది. డీఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం యువజన సంఘాల నాయకులు, హిందూ సంఘాల నాయకులతో పలుమార్లు చర్చలు జరిపారు. చివరకు రాజీ కుదిరి ఆందోళన విరమించారు.

Recent

- Advertisment -spot_img