రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్కు సంబంధించి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ప్రతిపాదనపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలాగే 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించనుంది.దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు పాలకవర్గాల నియామకానికి సంబంధించి చట్ట సవరణకు సంబంధించిన ప్రతిపాదనను మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది.రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూకేటాయింపులకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంపై మంత్రివర్గం చర్చించనుంది. సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలుపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.