Homeజిల్లా వార్తలుతప్పులుంటేనే చర్యలు తీసుకుంటం

తప్పులుంటేనే చర్యలు తీసుకుంటం

– కావాలని కక్ష సాధించం
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇదే నిజం, హైదరాబాద్: గత పదేళ్లుగా రహదారులపై బీఆర్ఎస్ సర్కార్ ఫోకస్ పెట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సెక్రటేరియట్​లో రోడ్లు, భవనాలు (ఆర్‌అండ్‌బీ) శాఖ మంత్రిగా ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 9 ఫైల్స్​పై సంతకాలు చేశారు. వీటిలో నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని 4 లేన్‌లుగా చేయడం, కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి. రానున్న 2 – 3 ఏళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు.‘దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రహదారుల మెరుగుకు కృషి చేస్తా. భువనగిరి ఎంపీ పదవికి సోమవారం రాజీనామా చేస్తా.

రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అడుగుతాను. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) సౌత్‌ను జాతీయ రహదారిగా గుర్తించాలని కోరుతాను. అలాగే విజయవాడ – హైదరాబాద్ రహదారిని 6 లేన్లకు, హైదరాబాద్ – కల్వకుర్తి 4 లేన్లకు, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్​)ను పెంచాలని అడుగుతా. 9 ఫైల్స్​లో ఐదింటి అనుమతికి సోమవారం గడ్కరీని కలుస్తాను. హైదరాబాద్ – విజయవాడ రహదారిలో మల్కాపూర్ వరకు కొంత పని అయిపోయింది. 6 నెలల్లో దానిని పూర్తి చేస్తాం. హైదరాబాద్ – విజయవాడ రహదారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రెండున్నర గంటల్లో విజయవాడ చేరుకునేలా విస్తరిస్తాం. కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆదేశించారు. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడుతాం. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎల్‌పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు ఏం చేశారు? ఎవరి మీదా.. కావాలని కక్ష సాధించం. తప్పులు ఉంటే వాటిపై చర్యలు తీసుకుంటాం. రహదారుల నిర్వహణే మా మొదటి ప్రాధాన్యత’అని కోమటిరెడ్డి వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img