Homeక్రైంబెయిల్​పై బయటికి వచ్చి.. యువతిని వెంటాడి హత్య

బెయిల్​పై బయటికి వచ్చి.. యువతిని వెంటాడి హత్య

– ఉత్తరప్రదేశ్​లోని కౌశాంబి జిల్లాలో దారుణం
– పరారీలో ఇద్దరు నిందితులు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. కొద్దిరోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చిన ఇద్దరు సోదరులు ఆమెను రోడ్డుపై పరిగెత్తించి, నరికి చంపారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవన్‌ నిషద్, అశోక్ నిషద్ కొద్దిరోజుల క్రితమే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. పశువులు కాసుకొని ఇంటికి తిరిగివస్తోన్న 19 ఏళ్ల యువతిని నడిరోడ్డుపై వెంటాడి గొడ్డలితో నరికిచంపారు. ఆ సమయంలో అక్కడున్నవారంతా భయంతో వణికిపోయారని పోలీసులు తెలిపారు. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ దారుణానికి కారణమని వెల్లడించారు. మూడేళ్ల క్రితం ఆ యువతిపై పవన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన కేసులో అతడు జైలుకెళ్లాడు. ఆ కేసు వెనక్కి తీసుకోవాలని నిషద్ సోదరులు యువతి కుటుంబాన్ని వేధిస్తున్నారు. కానీ వారి బెదిరింపులకు బాధిత కుటుంబం లొంగలేదు. వేరే కేసులో జైల్లో ఉంటున్న అశోక్‌తో పాటు పవన్ కూడా ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. అత్యాచార కేసు వెనక్కి తీసుకునే విషయంలో యువతి కుటుంబంతో వారికి మరోసారి ఘర్షణ జరిగింది. ఆ కుటుంబం అందుకు ససేమిరా అనడంతో నిందితులు ఆమెను చంపేందుకు ప్లాన్‌ చేశారు. పశువులు కాసుకొని ఇంటికి తిరిగివస్తున్న ఆమెను పరిగెత్తించి, గొడ్డలితో నరికిచంపేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం తరలించామని, నిందితులను అరెస్టు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశామని కౌశాంబి ఎస్పీ వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img