– మేనల్లుడి పేరును ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ పేరును ప్రకటించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఏడాది కాలంగా ఆకాశ్ ఆనంద్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు ఆయన చేపట్టనున్నారు. ఆకాశ్ ఆనంద్ మాయావతి తమ్ముడి కుమారుడు. 2016లో బీఎస్పీలో చేరిన ఆకాశ్ 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2022లో రాజస్థాన్లోని అజ్మేర్లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రతోపాటు, ఇటీవల డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప్ యాత్రలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ పేరును ప్రకటించడం పార్టీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మాయావతి తర్వాత అధ్యక్ష పదవి ఎవరు చేపడతారన్న చర్చకు తెరదించినట్లయింది.