భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ యాత్ర పూర్తిగా నిలిచిపోనుంది. అలాగే, యాత్రకు సంబంధించిన హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేశారు. పాకిస్థాన్ దాడుల ఆందోళనకర నేపథ్యంలో, చార్ధామ్ యాత్రలోని నాలుగు ప్రధాన గమ్యస్థానాలు—బద్రినాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల రీత్యా ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.