అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అగ్ర పారిశ్రామిక సంస్థగా సాగుతుంది. దేశంలో కూడా రిలియన్స్కు పోటీగా, రిలయన్స్ను దాటేలా సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతుంది. ఈ మద్య కాలంలో అమెజాన్ అడుగులు ప్రపంచ వ్యాప్తంగా ముందంజలో ఉన్నా భారత్లో రిలియన్స్ సంస్థను దాటలేకపోతుంది. ఇక ముందు రిలయన్స్ సంస్థను దాటడమే టార్గెట్గా అమెజాన్ ఒప్పందాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రతి వ్యూహంగానే అంబానీ కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన సంస్థ స్థానాన్ని దేశంలో కాపాడుకునేలా అడుగులు వేస్తున్నారు. తాజాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్, కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ల మధ్య ఒప్పందానికి శనివారం జరిగే బోర్డు సమావేశంలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ అంగీకారం తెలపవచ్చని తెలుస్తుంది. మొత్తం నగదులో జరిగే ఈ ఒప్పందంలో ఫ్యూచర్ గ్రూప్కు చెందిన రుణాలన్నీ రిలయన్స్ రిటైల్కు వెళతాయి. అదే సమయంలో అందులో మైనారిటీ వాటా కూడా రిలయన్స్ రిటైల్కు వస్తుంది.
దీంతో ఫ్యూచర్ గ్రూప్ తొలుత తన అయిదు యూనిట్లయిన నిత్యావసరాలు, దుస్తులు, సరఫరా వ్యవస్థ, వినియోగదారు వ్యాపారాలను ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఈఎల్)లో విలీనం చేస్తుంది. ఆ తర్వాత ఎఫ్ఈఎల్ అన్ని రిటైల్ ఆస్తులను ఏకమొత్తంగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు విక్రయిస్తుందని ఈ పరిణామాలతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. మొత్తం లావాదేవీ విలువ రూ. 29 వేల నుంచి 30 వేల కోట్లుగా ఉండొచ్చని తెలుస్తుంది. రిలయన్స్ రిటైల్కు దుస్తులు, నిత్యావసరాలను దీర్ఘకాలం పాటు సరఫరా చేసే ఒప్పందాన్ని కూడా ఎఫ్ఈఎల్ కుదుర్చుకోవచ్ఛు.
ఎప్పటినుంచో రిటైల్ రంగంలో మార్కెట్ లీడర్గా మారాలన్న రిలయన్స్ కల ఈ ఒప్పందంతో నెరవేరుతుంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.63 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన రిలయన్స్ రిటైల్కు ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందం ద్వారా భారత్లోని సంస్థాగత రిటైల్ మార్కెట్లో మూడో వంతు కంటే అధిక మార్కెట్ వాటా లభిస్తుంది. అంతేకాదు పోటీదార్లపై గట్టి ఒత్తిడిని పెంచవచ్ఛు ముఖ్యంగా అమెరికాకు చెందిన అమెజాన్ ఇండియాకు ఇ-కామర్స్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వవచ్ఛు.