ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ తన 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ ‘స్విగ్గీ బోల్ట్’ను మరిన్ని నగరాలకు పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా 400 నగరాలు, పట్టణాలకు విస్తరించినట్లు కంపెనీ ప్రకటించింది. తాజాగా ఈ సేవలను గుంటూరు, వరంగల్, జగిత్యాల, రూర్కీ, నాసిక్ వంటి టైర్-2, టైర్-3 నగరాల్లో 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో బోల్ట్కు ఆదరణ ఉందని స్విగ్గీ తెలిపింది. హర్యానా, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పూర్తిగా తయారీ అవసరం లేని లేదా తయారీకి తక్కువ సమయం మాత్రమే పట్టే ఆహార పదార్థాలను ‘బోల్ట్’ కింద అందించనున్నట్లు స్విగ్గీ తెలిపింది. ఈ తరహా ఆర్డర్లకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రెస్టారెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని తెలిపింది. ‘బోల్ట్’ డెలివరీకి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ సేవలు 2 కి.మీలకే పరిమితమయ్యాయని స్విగ్గీ పేర్కొంది.