అమరావతిః ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయంలో హిందూ మతంపై దాడి జరుగుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ డీజీపీని ఆదేశించారు. దీంతో, సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. దీనికి సంబంధించి జీవో త్వరలోనే వెలువడనుంది.