హైదరాబాద్ః తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ నిలవగా నిజాం, రజాకార్ల పక్షాన సీఎం కేసీఆర్ ఉన్నారని తేలిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి భాజపా ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సంజయ్ను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్కు తరలించారు. అరెస్టు సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. భాజపా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలన్న ప్రజల డిమాండ్ ఎంత తీవ్రంగా ఉందో అసెంబ్లీ ముట్టడితో మరోసారి రుజువయిందన్నారు. త్వరలోనే కేసీఆర్ను ఫామ్హౌస్కే పరిమితం చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల బలప్రయోగంతో భాజపా నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అనంతరం బండి సంజయ్ను తరలిస్తున్న వాహనానికి భాజపా కార్యకర్తలు అడ్డంగా పడుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులను అడ్డుకున్న కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని గోషామహల్ తరలించారు. సెంబ్లీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ అసెంబ్లీ పరిసర ప్రాంతాల వరకు భాజపా నాయకులు, మహిళా మోర్చా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నాంపల్లి, బషీర్బాగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు పోలీసులు భాజనేత కె.లక్ష్మణ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు పలువురిని బలవంతంగా అరెస్టు చేశారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.