– తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు
– మహబూబ్నగర్ నుంచి పోటీ చేయనున్న డీకే అరుణ
– మహబూబాబాద్ బరిలో సీతారాం నాయక్
– మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు
– పెండింగ్లో వరంగల్, ఖమ్మం స్థానాలు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: లోక్సభ ఎన్నికలకు 72 మందితో రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. ఆదిలాబాద్ – గోడెం నగేశ్, పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్, మెదక్ – రఘునందన్రావు, నల్లగొండ – శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్కు సీతారాం నాయక్ను అభ్యర్థులుగా ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా.. మొదటి జాబితాలో 9 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ.. ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇటీవల 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ.. తాజాగా 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ (6)తో పాటు దాద్రానగర్ హవేలీ (1), ఢిల్లీ (2), గుజరాత్ (7), హర్యానా(6), హిమాచల్ప్రదేశ్(2), కర్ణాటక (20), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర(20), త్రిపుర (1), ఉత్తరాఖండ్ (2) రాష్ట్రాల్లో చొప్పున అభ్యర్థులను ఖరారు చేసింది.
లోక్సభ బరిలో మనోహర్ లాల్ ఖట్టర్
రెండో జాబితాలో మహారాష్ట్రలోని నాగ్పుర్ నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని బరిలో దించిన బీజేపీ.. ముంబయి నార్త్ – కేంద్రమంత్రి పీయూష్ గోయల్, హిమాచల్ప్రదేశ్లోని హమిర్పుర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, హర్యానాలోని కర్నాల్ నుంచి మాజీ సీఎం మనోహర్లాల్ ఖట్టర్ను పోటీలో ఉంచుతున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మైను హవేరీ, బెంగళూరు రూరల్ – డా. సీఎన్ మంజునాథ్, బెంగళూరు నార్త్ – కేంద్రమంత్రి శోభా కరాంద్లాజే, బెంగళూరు సౌత్- తేజస్వీ సూర్య, బీద్- పంకజ ముండే; ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి మాజీ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ను బరిలో నిలిపింది.