నేడుతెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన రజతోత్సవ సభను ఓరుగల్లు వేదికగా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా జరగనున్న భారీ బహిరంగ సభపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ సభలో ప్రసంగించనుండడం ఈ ఉత్సాహానికి ముఖ్య కారణం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించనున్న తొలి భారీ సభ కావడంతో, ఈ సమావేశం పార్టీకి కీలకమైనదిగా పరిగణించబడుతోంది.
కేసీఆర్ ఈ సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇస్తారు. రాబోయే రాజకీయ వ్యూహాల గురించి ఏ దిశానిర్దేశం చేస్తారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ సభ బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాక, పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హెలీకాప్టర్ ద్వారా సాయంత్రం 5:30 గంటలకు సభా వేదికకు చేరుకోనున్నారు. ఆయన సుమారు గంటన్నర పాటు ప్రసంగించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రసంగంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై విమర్శలు, బీఆర్ఎస్ బలోపేతానికి సంబంధించిన అంశాలు ప్రముఖంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.