ఇదే నిజం, చేవెళ్ల : మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రానికి పూర్వవైభవం రావడానికి సహకరించిన దాతలు అభినందనీయులని చేవెళ్ల మండల విద్యాధికారి పురన్ దాస్ అన్నారు. చేవెళ్ల మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవిత కాల గుర్తింపు కార్డుగా అపార్ కార్డు ఉపయోగపడుతుందని వాటి నమోదు కేవలం 50 శాతం మాత్రమే నమోదైందని, అపార్ కార్డు నమోదును వేగవంతం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అనంతరం మండల విద్యావనరుల కేంద్రానికి మరమ్మతులు చేయించడానికి, పెయింటింగ్ వేయడానికి, ఫర్నిచర్ సమకూర్చడానికి సహకారం అందించిన దాతలు చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, చేవెళ్ల పీఎసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి సమతా, చేవెళ్ల వాస్తవ్యులు, పెద్దలు తిరుపతి రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు హనుమంత్ రెడ్డిలను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. వారి సహకారంతోనే విద్యావనరుల కేంద్రం కొత్త శోభను సంతరించుకుందన్నారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని కొనియాడారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఖాజా పాషా ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆగిరెడ్డి, చేవెళ్ల మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు మల్లారెడ్డి, శ్రీకాంత్, ప్రవీణ్, ప్రధానోపాధ్యాయ సంఘం డివిజన్ నాయకులు వెంకటయ్య, జిల్లా మరియు మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు అక్బర్, మునీర్ పాష రాజశేఖర్, ప్రవీణ్, దయానందం, హరి, నర్సింలు, వెంకటేష్, మున్నూరు రాజశేఖర్, శివానందం, దయానందం తదితరులు పాల్గొన్నారు.