Homeహైదరాబాద్latest Newsబడి పిల్లలకు కారం బువ్వే దిక్కా..? కాంగ్రెస్ సర్కార్ పై హరీశ్‌రావు ఫైర్..!

బడి పిల్లలకు కారం బువ్వే దిక్కా..? కాంగ్రెస్ సర్కార్ పై హరీశ్‌రావు ఫైర్..!

  • సరైన భోజనం అందించాలన్న సోయి లేదా?
  • సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిండ్రు
  • కాంగ్రెస్ సర్కార్‌ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది
  • మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: భావి భారత పౌరుల పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ‘నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని కోరుతున్నాను’ అని హరీశ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Recent

- Advertisment -spot_img