ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తాము అధికారంలోకి వస్తే వరిపంటకు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీల్లోనే ఈ అంశాన్ని చేర్చింది. ఎన్నికల ప్రచారసభల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా వరికి బోనస్ ఇస్తామని.. కాబట్టి.. వడ్లు ఇప్పుడే అమ్ముకోవద్దని కూడా చెప్పారు. దీంతో చాలా మంది రైతులు వడ్లు అమ్ముకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ హామీపై కాంగ్రెస్ నేత కోదండరెడ్డి మాట మార్చారు. ఒకవేళ వరికి మద్దతు ధర (ఎంఎస్ పీ) లేకపోతే వరికి రూ. 500 బోనస్ ఇస్తామని తాము చెప్పామన్నారు. అయితే ఇప్పుడు వరికి ఓపెన్ మార్కెట్లో 2600 ధర పలుకుతోంది కాబట్టి తాము రూ. 500 బోనస్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. కాగా కోదండరెడ్డి ప్రకటన పట్ల రైతులు, రైతు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆరు గ్యారెంటీల్లో ఎటువంటి షరతులు విధించకుండా ఇప్పుడు రోజుకో రూల్ ఎందుకు పెడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.