- ఎంపీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనపై.. హైకమాండ్ ఫుల్ సీరియస్
- ఓటమికి కారణాలపై త్రిసభ్య కమిటీ
- 11 సీట్లు వస్తాయని భావించిన అధిష్ఠానం
- కానీ గెలుచుకున్నది 8 సీట్లు మాత్రమే..
- రేవంత్ పై ఫిర్యాదుల పర్వం
- చేజేతులా కొన్ని సీట్లు పోగొట్టుకున్నారని ఆగ్రహం
- బలపడ్డ భట్టి, పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి
- సొంతజిల్లాలో ఎమ్మెల్సీ పోయి.. ఎంపీ పోయి రేవంత్ బిక్కు బిక్కు
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలు
- ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల ముందు వరకు ఓ లెక్క.. తర్వాత ఓ లెక్క అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి మారిపోయింది. పీసీసీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా ఇంతకాలం పార్టీలో తిరుగులేని ఆధిపత్యం సాధించిన రేవంత్ రెడ్డికి తాజాగా మూడినట్టే కనిపిస్తోంది. పార్టీలో ఆయన పలుకుబడి తగ్గిపోయింది. అధిష్ఠానం వద్ద కూడా పెద్దగా మాట చెల్లుబాట అవుతున్నట్టు లేదు. వెరసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా 12 స్థానాలు గెలుచుకుంటామని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా అటువంటి ధీమా కనిపించింది. కానీ గెలిచిందే కేవలం 8 సీట్లే.. పైగా రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు తెచ్చుకున్న బీజేపీ.. అదే స్థాయిలో పార్లమెంటులోనూ తెచ్చుకోగలిగిందంటే ఆ పార్టీ ఎంత గణనీయంగా పుంజుకున్నదో తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ హైకమాండ్ మనిషి వీహెచ్ అప్పుడే రేవంత్ మీద బహిరంగ విమర్శలు చేయడం గమనించ దగిన విషయం.
సీనియర్ల సత్తా
నిజానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లోకి రావడానికి రేవంతే కారణమని ఆయన వర్గీయులు ఎప్పుడూ గట్టిగా చెబుతుంటారు. అసలు రేవంత్ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు అన్నట్టుగా వారు మాట్లాడుతుంటారు. కానీ ఎంపీ ఎన్నికల్లో రేవంత్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. పైగా సీనియర్ లీడర్లు, ఇతర మంత్రులు తమ పట్టు నిలబెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటికి చెంది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పట్టు నిలుపుకున్నది. ఖమ్మం, మహబూబాబాద్ సునాయాసంగా గెలిచింది. ఇక నల్లగొండ మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దుమ్ములేపారు. భారీ మెజార్టీతో నల్లగొండ, భువనగిరి సెగ్మెంట్లలో సత్తా చాటారు. ఇక ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ హీరోలుగా నిలిచారు.
ఆ మూడింటితోనే మూడిందా?
మల్కాజిగిరి, చేవెళ్ల, పాలమూరు ఈ మూడు సెగ్మెంట్లను గెలిపించే బాధ్యత రేవంత్ రెడ్డి మీద పడింది. కానీ ఈ మూడు సెగ్మెంట్లలోనూ ఆయన బొక్క బోర్లా పడ్డారు. చేవెళ్లలో రేవంత్ ప్లాన్ బెడిసికొట్టింది. ఇక్కడ బలమైన లీడర్ పట్నం మహేందర్ రెడ్డి భార్య.. సునీతా రెడ్డికి టికెట్ ఇవ్వకుండా.. ఆమెను మల్కాజిగిరికి పంపారు. ఇక చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ఇటు మల్కాజిగిరి, అటు చేవెళ్ల రెండు స్థానాల్లో వీక్ అయ్యింది. దీంతో ఈ రెండు సీట్లను కాంగ్రెస్ చేజార్చుకోవాల్సి వచ్చింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డితో రేవంత్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. కొండాను అనేక సందర్భాల్లో రేవంత్ పొగిడారు కూడా.. ఇక ఈటల విషయంలోనూ రేవంత్ రెడ్డిదే సాఫ్ట్ కార్నరే.. వీళ్లిద్దరూ తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న దాఖలాలు లేవు. దీంతో కొండా, ఈటలను గెలిపించేందుకే రేవంత్ ఇటువంటి డ్రామా ఆడారా? అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇక మహబూబ్ నగర్ స్థానంలో కాంగ్రెస్ ఓడిపోవడంతో రేవంత్ పరువు పూర్తిగా పోయింది. ఆయన ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ.. పాలమూరు రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గం ఆ సీటును ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 10 నుంచి 12 సభలు నిర్వహించారు. అంతర్గత సమావేశాలకు లెక్కే లేదు. చేరికలు, ప్రలోభాలతో ఫుల్ హైప్ క్రియేట్ చేశారు. ఇంత చేసినా ఇక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అరుణను తట్టుకోలేకపోయారు. మరోవైపు సొంత జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో రేవంత్ పరిస్థితి మరింత డౌన్ అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
హైకమాండ్ ఫుల్ సీరియస్
ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చెప్పుకోదగ్గ సీట్లు సాధించింది. ఆ పార్టీ ఎక్కువ సీట్లు వస్తాయని భావించిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. కానీ ఇక్కడ కేవలం 8 సీట్లు మాత్రమే తెచ్చుకున్నది. దీంతో హైకమాండ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసిందట. గతంలో రేవంత్ రెడ్డిని సమర్థుడిగా భావించి.. ఎన్ని ఒత్తిడులు ఉన్నా అతడినే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేసింది. కాగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో సీనియర్ మంత్రులు సత్తా చాటారు కానీ రేవంత్ ఉసూరుమన్నారు. దీంతో రేవంత్ మీదే కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉందట. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమిపై అధ్యయనం చేసేందుకు పార్టీ త్రిసభ్య కమిటీ ని వేసింది. పీజే కురియన్ (కేరళ), రకీముల్ హసన్ (అస్సాం) , పర్గత్ సింగ్ (పంజాబ్) ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ లీడర్లను, ద్వితీయశ్రేణి నేతలను, వివిధ వర్గాల ప్రజలను కలుసుకొని అధ్యయనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు తక్కువ సీట్లు సాధించింది? తదితర అంశాల ఆధారంగా ఓ నివేదికను ఇవ్వనున్నది. అయితే ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ ఏమైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నదా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతున్నదా? అన్న చర్చ కూడా సాగుతోంది.