హైదరాబాద్ః యూజీసీ నిబంధనల ప్రకారం డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ కరోనా వేళ డిగ్రీ పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. లాక్ డౌన్ కారణంగా హాస్టళ్లు మూసి ఉన్నందున పరీక్షలు రాయడం వీలుకాదని, చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించగలరా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టెక్నాలజీ సాయంతో ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు ఆన్ లైన్లో పరీక్షలు నిర్వహించవచ్చు కదా అని హైకోర్టు అభిప్రాయపడింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్గా పరిగణిస్తారా.. అని హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను స్పష్టత కోరింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన ఏజీ దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి సమాధానం చెప్తానని అన్నారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
22 నుంచి ఓయూ డిగ్రీ పరీక్షలు
డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలను నిర్వహించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 22 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు మొదలుకానున్నాయి. 15 నుంచి ఇంజనీరింగ్, బీసీఏ, బీఈడీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించేందుకు స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం కూడా లభించింది. దీంతో ఎగ్జామ్స్ నిర్వహణకు ఓయూ ఏర్పాట్లు చేస్తోంది.