యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. నేటితో కార్తీకమాసం ముగుస్తుండటం, ఆదివారం సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. కొండ కింద వ్రత మండపంలో భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు వ్రతమాచరించారు. దీపారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. తెల్లవారు జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు.. ఆలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కల్యాణమండపంలో 108 కలశాలకు పూజలు జరిపారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను రథసేవలో తీరిదిద్ది మండపంలో ఊరేగించనున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువ జామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.