ఇండోర్: ప్రేమించి పెండ్లి చేసుకున్న 15 రోజులకే రోడ్డు ప్రమాదం భర్తను బలి తీసుకుంది. ఆయన మరణాన్ని తట్టుకోలేని ఆమె ఆత్మహత్యకు యత్నించి ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని సానియా సుమన్ (28), ఉజ్జయినికి చెందిన శుభం ఖండేల్వాల్ అనే యువకుడిని 15 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులు ఇండోర్లో కాపురం పెట్టారు. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందారు. దీంతో సానియాను తమతో పాటు తీసుకు వెళ్లేందుకు వచ్చిన తల్లితండ్రులు విమానాశ్రయంలో వేచి ఉన్నారు. అయితే విమానాశ్రయానికి వస్తానన్న ఆమె.. ఇంతలోనే తీవ్ర నిర్ణయానికి వచ్చింది. ఓ షాపింగ్మాల్లో మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్తతో కలిపి తనకు దహన సంస్కారాలు చేయాలని వైద్యురాలు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ కుమ్రావత్ తెలిపారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యువతి షాపింగ్ మాల్లో పైనుంచి దూకిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.