– సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లావాసులు
ఇదే నిజం, ప్రతినిధి వరంగల్: రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జిల్లాకు మరో అవకాశం దక్కింది.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నలుగురిని విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నలుగురిలో ఉమ్మడి వరంగల్లోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ కు ప్రభుత్వ విప్గా అవకాశం దక్కడం గమనార్హం. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా సీతక్క, కొండా సురేఖ లకు అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మరోసారి డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ కి విప్ పదవి కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కేబినెట్లో ఇంకా కొన్ని ఉమ్మడి జిల్లాలకు చోటు దక్కలేదనే చర్చ జరుగుతున్న క్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేను విప్గా కేటాయించడం ముఖ్యమంత్రి ది సాహసోపేత నిర్ణయంగానే చెప్పాల్సి ఉంటుందనేది రాజకీయ వర్గాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత కల్పించడం పట్ల జిల్లా వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.