– ప్రయాణికుడు సజీవ దహనం
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: నల్గొండ వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు సజీవదహనమయ్యాడు. మర్రిగూడ బైపాస్ దగ్గరలో షార్ట్సర్క్యూట్తో బస్సు దగ్ధమయ్యింది. మంటలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగిపోయారు. నిద్రమత్తులో ఓ వ్యక్తి బస్సు దిగకపోవడంతో.. అతడు సజీవదహనమై మృతి చెందినట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.