లోక్సభలో వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా పోరాటం చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు. దేశంలో లాక్డౌన్ విధింపుతో సుమారు 29లక్షల కరోనా వైరస్ కేసులను తగ్గించగలిగామని, అదే సమయంలో దాదాపు 38వేల మంది మరణాలను నియంత్రించగలిగామని మంత్రి తెలిపారు. సోమవారం లోక్సభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితిపై ఆయన ప్రకటన చేశారు. కొవిడ్ బారిన పడినవారిలో 92శాతం మందికి మధ్యస్తంగానే లక్షణాలు ఉన్నాయని, కేవలం 5.8శాతం మందికే ఆక్సిజన్ థెరపీ అవసరమైందని, 1.7శాతం మందికి ఐసీయూలో ఉంచినట్టు ప్రకటించారు. కరోనా బారినపడినవారిలో ప్రధానంగా జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
మరణాల రేటు మన దగ్గరే తక్కువ
డబ్ల్యూహెచ్వో తెలిసిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.79 కోట్ల మందికి కరోనా సోకగా.. 9.05 లక్షల మరణాలు నమోదయ్యాయని చెప్పారు. ప్రపంచంలో మరణాల రేటు 3.2శాతంగా ఉందన్నారు. సెప్టెంబర్ 11 నాటికి దేశ వ్యాప్తంగా 45,62,414 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 76,271 మరణాలు నమోదయ్యాయని వెల్లడించారు. దేశంలో 35,42,663 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 77.65శాతంగా ఉందన్నారు. మరణాల రేటు 1.67శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. దేశంలో మిలియన్ జనాభాకు 3328 కేసులు, 55 మరణాలు ఉన్నాయని హర్షవర్దన్ తెలిపారు.