– ఏడాది తర్వాత పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు
– అమెరికాలోని మసాచుసెట్స్లో ఘటన
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: అమెరికాలోని మసాచుసెట్స్ వర్సిటీలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు హైటెక్ ఫ్రాడ్కు పాల్పడ్డారు. జస్ట్ 12 సెకన్లలో 25 మిలియన్ డాలర్ల క్రిప్టోకరెన్సీ(రూ.200 కోట్లు)ని దొంగిలించారు. వారి మోసం బయటపడి ఏడాది తర్వాత పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఆంటోన్ బ్యూనో, జేమ్స్ బ్యూనో ఇద్దరూ అన్నదమ్ములు. వీళ్లు మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీపై వీరికి మంచి పట్టు ఉండటంతో ఈజీ మనీ కోసం మోసానికి పాల్పడ్డారు. గతేడాది ఏప్రిల్లో క్రిప్టో టెక్నాలజీలో పెండింగ్ లావాదేవీలను మోసపూరితంగా యాక్సెస్ చేసి వాటిని మార్చారు. కేవలం 12 సెకన్లలోనే 25 మిలియన్ డాలర్ల విలువైన ఇథేరియం క్రిప్టోలను వారు తమ అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నారు.ట్రేడర్లు తమ ఖాతాల్లోకి క్రిప్టో లావాదేవీలు జమచేస్తున్నా కాకపోవడంతో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ హైటెక్ ఫ్రాడ్ బయటపడింది. దర్యాప్తు చేపట్టిన ఫెడరల్ ప్రాసిక్యూటర్లు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. బోస్టన్లో ఆంటోన్ను, న్యూయార్క్లో జేమ్స్ను అరెస్టు చేశారు. నిందితులు ఐదు నెలల పాటు ఇందుకు ప్లాన్ చేసి సెకన్లలో అమలుచేశారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. విచారణలో నేరాన్ని అంగీకరించిన ఈ అన్నదమ్ములు.. ఆ క్రిప్టోలను తిరిగిచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నేరం రుజువైతే వీరిద్దరికీ 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.