హైదరాబాద్ః జీహెచ్ఎంసీ పరిధిలో ఓపెన్ నాలాలపై రూ.300 కోట్లతో క్యాపింగ్ నిర్మాణం చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు పేర్కొన్నారు. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాల పైన క్యాపింగ్ పనులు చేపట్టేందుకు న ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులు త్వరలోనే ఇస్తామన్నారు. సాధారణంగా 2 మీటర్ల కన్నా తక్కువ వెడల్పు ఉన్న నాలాలన్ని కూడా జనసమ్మర్థం ఎక్కువ ఉన్న కాలనీలు, బస్తీలలో ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. రెండు మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు ఉన్న నాళాల పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల సమాచారం సేకరించాలని మంత్రి జోనల్ కమిషనర్లకు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించారు.