నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని సీఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయి అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పిల్ల చేష్టలు, గారడీ మాటలు,లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావ్ అని నిలదీశారు. నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుంది అని తెలిపారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి.. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి.. మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా అని ప్రశ్నించార. ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి.. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావు అని కేటీఆర్ నిలదీశారు.