గత కొన్ని రోజులగా దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసగా వస్తున్న బెదిరింపులు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. విమానాలు టేకాఫ్ కాకముందే ఇలాంటి బెదిరింపులు వస్తుండటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి రూట్లను మళ్లిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో విమానాలను టేకాఫ్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు దారి మళ్లించారు. జైపూర్-దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు ముప్పు వచ్చింది. అయితే అది ఫేక్ అని తేలింది. ఇవి కాకుండా ఈరోజు మరో ఐదు ఆకాశ ఎయిర్ విమానాలు, ఐదు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.గత సోమవారం నుంచి దాదాపు 50 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. బూటకపు బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.