ఇదేనిజం, బెల్లంపల్లి : నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీకెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం మందమర్రి పట్టణంలోని మేకల మండి ప్రాంతంలో రాజన్నల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరు సీసీ కెమెరాలను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రిచ వచ్చన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల, కాలనీలా ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని, గ్రామాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పరిశోధన, నియంత్రణలో కీలకం…
‘నేర పరిశోధన, నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యం పెరిగింది. దొంగలు, దోషులను పట్టుకోవడంలో మార్గం సుగమం అవుతున్నది. ప్రస్తుతం పల్లెల్లోనూ సీసీ కెమెరాలు పెడుతున్నారు. గతంలో దొంగతనాల పరిశోధన కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో చోరీలు తగ్గుముఖం పడ్డాయి. సీసీ ఫుటేజీల ద్వారా దోషులను గుర్తించి, గంటల వ్యవధిలోనే పట్టుకోగలుగుతున్నాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలి. నేర నియంత్రణ, రక్షణ కల్పించేందుకు మాకు ప్రజలు సహకరించాలి’. అని మందమర్రి సీఐ శశిధర్రెడ్డి ప్రజలను కోరారు. కార్యక్రమంలో మందమర్రి ఎస్ఐ రాజశేఖర్, శంకర్, కనకయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.