Homeహైదరాబాద్latest Newsబండికి చెక్​ పెట్టేందుకు ఈటల గట్టి ప్లాన్​

బండికి చెక్​ పెట్టేందుకు ఈటల గట్టి ప్లాన్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఈటల మరోసారి గేమ్​ ప్లాన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈటల రాజేందర్​ కరీంనగర్​ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో మాట్లాడుతూ.. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్​ కావాలని అధిష్ఠానాన్ని కోరినట్టు చెప్పారు. అంతేకాక తనకు కరీంనగర్​ పార్లమెంట్​ సెగ్మెంట్ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని.. అయినా సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కనక తాను మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. ఈటల తాజా ప్రకటన వెనక భారీ స్కెచ్​ ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఈ సారి ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్నారు. అసలు ఏ కారణంతో ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారో తెలియదు. ఎందుకంటే బీజేపీ లో ప్రస్తుతం వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు టికెట్​ ఆశిస్తున్న వారందరికీ ఓ కారణం ఉంది. వారు గతంలో పోటీచేసి ఓడిపోవడం.. సిట్టింగ్​ ఎంపీలుగా ఉండటం.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీకి దూరం ఉండటం.. వంటి కారణాలతో వారంతా పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఈటల మాత్రం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఆయా పార్లమెంటు సెగ్మెంట్​ పరిధిలో ఇప్పటికే బలమైన అభ్యర్థులు ఉండటంతో కొత్త స్థానాన్ని ఎంచుకున్నారు. గతంలో కొత్త వారిని గెలిపించిన చరిత్ర మల్కాజిగిరి నియోజకవర్గానికి ఉన్నది. కొడంగల్​ లో ఓడిపోయిన రేవంత్​ రెడ్డి.. మల్కాజిగిరిలో గెలుపొందారు. అందుకే ఈటల ఈ స్థానాన్ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దానికి తోడు ఇక్కడ మోడీ వేవ్​ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈటల ఇక్కడ గెలవాలంటే కచ్చితంగా కల్ట్​ బీజేపీ అభిమానులు ఆయన కోసం పనిచేయాలి. వారంతా ప్రస్తుతం దాదాపుగా బండి సంజయ్​ కు మద్దతు ఇస్తున్నవారే. దీంతో బండి సంజయ్​ కరీంనగర్​ లో గెలవాలంటే.. మీరు ఇక్కడ నాకు సపోర్ట్ చేయాల్సిందే అన్నట్టుగా ఈటల వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పాత గేమ్​ ప్లాన్​ రిపీట్​ చేస్తున్నాడా?
గతంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్​ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో సొంత పార్టీ మీదే విమర్శలు గుప్పించారు. పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈటలను పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది. ప్రజల్లో విపరీతమైన సానుభూతి వ్యక్తమైంది. ఇదే అదనుగా భావించిన ఈటల అప్పటి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మళ్లీ అదే ప్లాన్ మరోసారి బీజేపీలోనూ రిపీట్​ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ మీద కూడా ఈటల వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. చివరకు బీజేపీ పెద్దలు ఆగ్రహించి ఆయనను బయటకు పంపిస్తే.. ఆ సానుభూతితో మరోసారి గెలవొచ్చని ఈటల చూస్తున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్​ పార్టీలో స్పెస్​..
ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీలో కరీంనగర్​ నుంచి బలమైన అభ్యర్థి ఎవరూ లేరు. బీఆర్ఎస్​ నుంచి వినోద్​ కుమార్​, బీజేపీ నుంచి బండి సంజయ్​ రంగంలోకి దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. కరీంనగర్ లో మాత్రం పెద్దగా బలమైన నేత లేరు. కాబట్టి ఈటల తమ పార్టీలో చేరితే కాంగ్రెస్​ కచ్చితంగా స్వాగతిస్తుంది. ఆయనకు కరీంనగర్​ టికెట్​ ఇస్తుంది. అయితే కేవలం టికెట్ కోసమే కాంగ్రెస్​ పార్టీలో చేరితే ప్రజల్లో పలుచన అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా బీజేపీలో టికెట్​ దక్కకుండా.. ఆ పార్టీ బలవంతంగా బయటకు పంపిస్తే ఈటలకు సింపతీ వస్తుంది. ఈ కారణంగానే ఆయన కొత్త గేమ్​ కు తెరలేపారని తెలుస్తోంది. మరోవైపు తనకు మల్కాజిగిరి టికెట్​ ఇవ్వకపోతే .. కాంగ్రెస్​ పార్టీలో చేరిపోతా.. అక్కడి నుంచి టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తా అనే పరోక్ష సంకేతాలు కూడా అధిష్ఠానానికి పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్​ రెండు విధాలా లాభం చూసుకుంటున్నారు. ఒకవేళ అధిష్ఠానం మల్కాజిగిరి టికెట్​ ఇస్తే తాను అక్కడి నుంచి పోటీ చేస్తాడు. లేదంటే పార్టీ నుంచి బయటకు వచ్చి .. టికెట్​ ఇవ్వలేదు.. అవమానించిందని ఆరోపించి కాంగ్రెస్​ పార్టీ నుంచి కరీంనగర్​ నుంచి పోటీ చేస్తారు. ఇలా ఈటల తనదైన శైలిలో రాజకీయం నడుపుతున్నారు. మరి అధిష్ఠానం ఏం చేస్తుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img