హైదరాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ, ఈడీ, పోలీసులు అందరూ రియాపైనే ఫోకస్ చేశారు. మరోపక్క సోషల్ మీడియాలో సుశాంత్ మరణానికి రియానే కారణం అంటూ ట్రోల్ చేస్తున్నారు. దాంతోపాటు రియా కుటుంబాన్ని సైతం వదలడం లేదు. సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అభిమానుల వరకు అందరూ రియానే వెలేత్తి చూపుతున్నారు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సుశాంత్ బిడ్డకు తల్లిని కావాలనుకున్నానని.. అలాంటి వాడి చావు ఎందుకు కోరుకుంటానంటూ వాపోయింది. ఇటీవల రియాకు సెలబ్రిటీల నుంచి మద్దతు లభిస్తుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ మంచులక్ష్మీ రియాకు మద్దతు ప్రకటిస్తూ ‘జస్టిస్ ఫర్ రియా చక్రవర్తి’ అనే హ్యాష్ ట్యాగ్ను తన ట్విటర్లో పోస్టు షేర్ చేసింది. నిజానిజాలు తెలియకుండా రియా కుటుంబంపై నిందలను వేయొద్దని కోరింది. రియాను మీడియా రాక్షసిగా చూపిస్తుందని మండిపడింది. నిజం ఎలాగైనా బయటకు వస్తుందని నమ్ముతున్నా.. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని మంచు లక్ష్మి పేర్కొంది. మంచు లక్ష్మితో పాటు రియాకు తాప్సీ కూడా అండగా నిలిచింది.