KCR:ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామానాగేశ్వర్రావు, రవిచంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్ కమల్రాజ్ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 18న ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభ జరుగనున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్లపై ఖమ్మం జిల్లా నేతలతో సీఎం చర్చిస్తున్నారు.
పార్టీ ఆవిర్భావం అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కోరిన సీఎం కేసీఆర్, ఈ సభ ద్వారా దేశ రైతాంగానికి, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. బీఆర్ఎస్ ద్వారా దేశ వ్యవసాయరంగంలో తీసుకొచ్చే మార్పులపై ఈ సభ ద్వారా వివరించనున్నట్టు సమాచారం.