– తెలంగాణ భవన్లో తీర్మానం చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు
ఇదే నిజం, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎల్పీ(శాసనసభా పక్ష నేత)గా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీ కేశవరావు అధ్యక్షతన శనివారం తెలంగాణ భవన్లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో నిలిచిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత కేసీఆర్కు సర్జరీ జరిగిన కారణంగా శనివారం నాటి సమావేశానికి హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్నందున బీఆర్ఎస్ఎల్పీ భేటీకి కేటీఆర్ హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు పద్మారావు, ముఠా గోపాల్ కూడా సమావేశానికి రాలేదు.