మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని చెప్పారు. వచ్చే నెలలో తెలంగాణ భవన్ లో ప్రతి రోజు కార్యకర్తలను కలుస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాదిలోపే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని చెప్పారు. కేసీఆర్ కిట్లపై కేసీఆర్ ఫోటో తొలగించినా.. ప్రజల గుండెల నుంచి కేసీఆర్ ను తొలగించలేరని అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగితే ఎమ్మెల్యేలంతా బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ వంటిదని… ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ మన సత్తా ఏమిటో చూపిద్దామని అన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసినప్పటికీ ప్రతిపక్షాల దుష్ప్రచారం వల్ల ఓడిపోయామని చెప్పారు.