కమల్హాసన్ సినీ జీవితంలో సంచలన చిత్రం ఎర్రగులాబీలు సీక్వెల్లో మహానటి సినిమాతో తన టాలెంట్ను చూపిన కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం. నలభై రెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. కమలహాసన్, శ్రీదేవి జంటగా భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగప్పు రోజక్కల్’ తమిళ చిత్రాన్ని తెలుగులో ఎర్రగులాబీలుగా అనువదించారు. అప్పటి సినీ కథలకు భిన్నంగా ఉండడంతో ఈ చిత్రం యువతను ఆకర్షించింది. భయంకరమైన సైకో పాత్రలో కమలహాసన్ సరికొత్త నటనతో చిత్రం బాగా ఆడింది. అటువంటి ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు భారతీరాజా కొడుకు మనోజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి చంపి పాతిపెట్టే క్రూరమైన పాత్రలో కమల్హాసన్ నటించారు. కొత్త సీక్వెల్లో అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలపై ప్రతీకారం తీర్చుకునే పవర్ఫుల్ పాత్రలో కీర్తీ సురేష్ నటించనున్నారు. విభిన్న కథలకు కీర్తి సురేష్ మాత్రమే న్యాయం చేయగలదని దర్శకుడు భావిస్తున్నాడు.