తెలంగాణలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గురుకుల పాఠశాలలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. గురుకుల వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు అవగాహన లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అందుకే 21 నియోజకవర్గాల్లో ఇంటిగ్రెటేడ్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. కేవలం రూ. 25 కోట్లతో 2560 మంది విద్యార్థులకు భవనాలు ఎలా నిర్మిస్తారు? పాఠశాలలు ఏమైనా కోళ్ల ఫారాలు అనుకుంటున్నారా? విద్యార్థులను కోడిపిల్లలు అని అనుకుంటున్నారా? అసలు మీరు ఎప్పుడైనా గురుకుల విద్యార్థుల వద్దకు వెళ్లారా? అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. నిజంగా ఈ ప్రభుత్వానికి విద్యారంగం అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఇంటిగ్రెటెడ్ స్కూళ్లపై అఖిలపక్షం నిర్వహించాలని, మేధావులు, నిపుణులతో చర్చించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 662 గురుకులాల్లో మరమ్మతులు, సౌకర్యాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.