నేపాల్ ప్రధాని కేపీ ఓలి (ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి) గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంటులో నేడు చేపట్టిన విశ్వాస పరీక్షలో కేపీ ఓలి పరాజితులయ్యారు.
ఓటింగ్ లో ఆయనకు అనుకూలంగా 93 మంది, వ్యతిరేకంగా 124 మంది స్పందించారు. నేపాల్ పార్లమెంటులో 271 స్థానాలు ఉండగా, నేడు సభకు 232 సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
వారిలో 217 మంది ఓటింగ్ లో పాల్గొనగా, 15 మంది సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. సభకు రానివారిలో కొందరు అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన అసమ్మతి సభ్యులున్నారు.
2015లో నేపాల్ లో నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఓ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం ఇదే ప్రథమం.
కాగా, బలపరీక్షలో ఓటమి నేపథ్యంలో ప్రధాని కేపీ ఓలి తన రాజీనామాను రాష్ట్రపతి బిద్యాదేవి బండారీకి సమర్పించనున్నారు.
ఆపై, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి పార్లమెంటును ఆదేశిస్తారు.
ప్రధాని కేపీ ఓలిపై అవిశ్వాస మేఘాలు ఎప్పటినుంచో అలముకుని ఉన్నాయి.
తాజాగా ప్రచండ ఆధ్వర్యంలోని అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీనే కేపీ ఓలికి మద్దతు వెనక్కి తీసుకుంది.
దాంతో పార్లమెంటులో విశ్వాస పరీక్ష నిర్వహించారు. పార్లమెంటులో ఇతర పార్టీల మద్దతుతో గండం గట్టెక్కగలనని కేపీ ఓలి విశ్వాస పరీక్షకు ముందు ధీమా వ్యక్తం చేశారు.
కానీ, సభలో అందుకు భిన్నమైన ఫలితం వచ్చింది.