KTR: నిజాయితీ, నైతికత ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవీ నుంచి తప్పుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో ఉంది. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం. యంగ్ ఇండియా వెనుక ఉన్న కుట్ర గురించి ఈడీ ఛార్జ్షీట్లో స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు.
అలాగే “రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని తేలిపోయింది. గతంలో రేవంత్ టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం రూ.50 కోట్లు ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం బయటపడింది,” అని కేటీఆర్ విమర్శించారు. అలాగే ప్రస్తుతం తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ దెయ్యాన్ని, శనిని ఎలా వదిలించాలనేదే మా మా తాపత్రయం” అని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, నైతిక విలువలు పాటించే సీఎం ఈ ఆరోపణల నేపథ్యంలో పదవిలో కొనసాగడం సమంజసం కాదని ఆయన అన్నారు.
“నేషనల్ హెరాల్డ్ కేసు గురించి తెలంగాణ BJP ఎంపీ ఒక్కరైన మాట్లాడడం లేదు. కర్ణాటకలో బీజేపీ నేతలు డీకే శివకుమార్ను ప్రశ్నిస్తుంటే, తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం రేవంత్ రెడ్డిని ఎందుకు గట్టిగా నిలదీయడం లేదు?. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీల భూదందాలు, కేంద్ర మంత్రుల అక్రమాలకు సహకరిస్తున్నారా..? అందుకే బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారా?” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్లో ప్రశ్నించారు.