హైదరాబాద్: అక్రమ ప్లాట్లు, వెంచర్స్, లే అవుట్స్ ఎల్ఆర్ఎస్కు సంబంధించి క్రమబద్ధీకరణ జీవో నం.131ని ప్రభుత్వం సవరించింది. రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ రుసుం వసూలు చేయాలని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. దీని కారణంగా ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుదారులకు సుమారు 50 శాతం వరకు భారం తగ్గుతుందని రియల్టర్లు తెలిపారు. రుసుం చెల్లింపు గడువు వచ్చే మార్చి వరకు ఉండటంతో పేద, మధ్య తరగతి ప్రజలపై పెద్దగా భారం ఉండదనివారు పేర్కొన్నారు.
జీవో నం.131 ప్రకారం చెల్లించాల్సిన రుసుంతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందని నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీతోపాటు చీఫ్ విప్ వినయ్భాస్కర్, సభ్యులు జగ్గారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వివేకానంద తదితరులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.