కోల్కతాః ఈ ఏడాది దుర్గాపూజలు వద్దని తాను అన్నట్టుగా ఓ రాజకీయ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దుర్గాపూజ వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు. దసరా సందర్భంగా కోల్ కతాలో ప్రతి సంవత్సరం నిర్వహించే దుర్గాపూజపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మమతా వివరించారు. ఒకవేళ, దుర్గాపూజ వద్దని తాను అన్నట్టు ఎవరైనా నిరూపిస్తే 101 గుంజీలు తీసేందుకు సిద్ధమని ఆమె సవాల్ విసిరారు. తనపై విపక్షాలు వదంతులు వ్యాపింప చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.