Homeఎడిటోరియల్​Devi Navratri : దేవీ నవరాత్రుల పద్దతులు తెలుసా...?

Devi Navratri : దేవీ నవరాత్రుల పద్దతులు తెలుసా…?

Methods of Devi Navratri : దేశ వ్యాప్తంగా హిందువులు భక్తి శ్రద్దలో దేవీ నవరాత్రులు ఏటా నిర్వహిస్తుంటారు.

ఈ క్రమంలో నిర్వాహకులు ఈ 9 రోజుల పాటు చెడు అలవాట్లకు, చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ నిగ్రహాన్ని పాటిస్తారు.

ఇక ప్రస్తుతం ఈ పద్దతులు కాస్తా చాలా మారిపోయాయి.

అసలు ఇప్పటి భక్తులు, భక్త సమాజం నవరాత్రులు అంటే ఎలా చేయాలో వారి దృష్టి ఎలా ఉందో తెలుసుకుందాం..

ఇప్పుడెలా ఉన్నాయి పద్దతులు… కొంత గమనిద్దాం…

ముందుగా విగ్రహ ఏర్పాటుకు డబ్బులు సమకూర్చుకునే సాకుతో చందాలు, మెంబర్​షిప్​లు వసూలు చేయాలి.

ఈ క్రమంలో చాలా మందిని ఇష్టపూర్వకంగానో లేదా కుల, మత, స్నేహం అనేక బందాలను ఉపయోగించి చేర్చుకుంటారు.

ఈ తతంగం అంతా నిరంతరం పరమ భక్తి శ్రద్దలు అంటే మద్యం, మాసం, చిల్లర తిరుగుల్లు తిరిగే వారు మొదలుపెడతారు.

ఇక అలా పోగు చేసిన డబ్బులో కొంత విగ్రహానికి, మరికొంత విగ్రహం పెట్టి ఊరుకోవడం కుదరదు కాబట్టి పంతులుకు, పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.

మిగిలిన డబ్బులో వారు పెట్టిన పెట్టుబడిని పక్కన పెట్టుకుని మద్యం, మసాలా పాటలు(ఐటం సాంగ్స్​) పెట్టుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లకు వినియోగిస్తారు.

ఇక అంతా అయిపోయాక లెక్కల దగ్గర లొల్లి కూడా వస్తుందనుకోండీ.. అంటే యాక్టివ్​ సభ్యులు వసూలు చేసిన ప్రస్తుత, గత సంవత్సర డబ్బులు మిగిలినా లెక్క చూపించరు అన్నమాట. అది…

నవరాత్రులు మొదలు విగ్రహం ఏర్పాటుకు తెచ్చే ముందే ఊరేగింపుగా విగ్రహం ముందు దుష్ప్రభావం ఉన్న హానికారక టపాకాయలు పేలుస్తూ, ఐటం సాంగ్స్​తో ప్రతిష్టాపనా స్థలానికి తెస్తారు.

ఏర్పాటు తరువాత ప్రతి రోజు పూజకు గంట ముందు, గంట తరువాత వరకు ఐటం సాంగ్స్​, డబుల్​ మీనింగ్​ ఫోక్​ సాంగ్స్​ పెట్టి పూజ సమయంలో భక్తి పాటలు పెడతారు. ఇక బజన సంగతి దేవునికే ఎరుక.

ఇక రాత్ని డెన్​ మూసేసాక అందులో సెటిల్మెంట్లు భూతు మాటలు, పేకాటలు అన్నీ నడుస్తాయి. తాగి కూడా అక్కడే పడుకుంటారు.

మళ్ళీ తరువాత సరదాలకు, డబ్బులు ఎక్కువ పోగేస్తే వారు సొంతానికి చిట్టీలు లాంటివి వేసుకుని వినియోగించుకునేందుకు, వారి సభ్యుల బాగోగుల(జల్సాల) కోసం కావాల్సిన డబ్బును పోగు చేసేందుకు ప్రసాద వేలం, దేవుడి వస్త్రాల వేలంపాట వంటి కార్యక్రమాలు చేస్తారు.

వీరు అమితమైన భక్తి శ్రద్దలతో నిర్వహించిన ఈ పూజలకు పరవశమైన పలువురు ఆ వస్తువులను వేలంపాటలో సొంతం చేసుకుని మేము ప్రపంచాన్ని జయించామని భావిస్తారు.

నిమజ్జనానికి.. ఒకరి మీద ఒకరు పోటీగా ఊరేగింపు.. అదీ భక్తితో బజనతో కాదు.. డీజే పాటలు, మంచి ఊపు తెచ్చే కామంతో కూడిన మాటలతో ఉండే పాటలు పెట్టి ఇగ ఎగురుడే ఎగురుడు..

చెరువులోనో కుంటలోనో విగ్రహాన్ని అలా వేసి వవచ్చేస్తారు.

అసలైన నవరాత్రులు…

నవరాత్రులు అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ, ఇందులో నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగం. నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.

ప్రాముఖ్యత

వసంతకాలం, శరదృతువుల మొదలు, వాతావరణపరంగా, సౌరప్రభావపరంగా చాలా ముఖ్యమైన సంధి కాలం.

దేవీ మాతను పూజించడానికి ఈ రెండు కాలాలూ చాలా పవిత్రమైన అవకాశాలుగా భావిస్తారు. పండుగ యొక్క తేదీలను, చంద్ర పంచాంగం ప్రకారం నిర్ణయిస్తారు.

హిందూ మతంలో విశ్వాసకులు ఒక సర్వశక్తిమంతమైన దేవత/దేవుడిని నమ్ముతారు, కానీ, పూజించే విషయానికి సంబంధించినంత వరకూ, ఆమె/అతడిని అనేక రకాలుగా వ్యక్తీకరించబడిన రూపంలో పూజించవచ్చు.

ఈ అనేక రూపాలు దేశమంతా ప్రబలంగా వ్యాపించి ఉన్నాయి.

నవరాత్రి దుర్గా దేవి ఉత్సవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, దుర్గాదేవి, శక్తి ఆకృతిలో వ్యక్తీకరించబడిన దేవత (శక్తి లేదా బలము). దసహరా అంటే ‘పది రోజులు’, ఇది వాడుక భాషలో దసరా అవుతుంది.

నవరాత్రి పండుగ లేదా ‘తొమ్మిది రాత్రుల పండుగ, చివరి దినాన, అంటే విజయదశమి రోజున పరాకాష్ఠకు చేరుకుని ‘పది రోజుల పండుగ’ అవుతుంది.

ఈ పదిదినాలలోనూ, మహిషాసురమర్ధిని అయిన దుర్గా మాత యొక్క అనేక రూపాలను ఆరాధనతో, భక్తితో పూజిస్తారు.

నవరాత్రి యొక్క సంప్రదాయాలు

నవరాత్రిని సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి, పౌష్య/మాఘ నవరాత్రి అంటారు.

వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి, వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి చాలా ముఖ్యమైనవి.

1. వసంత నవరాత్రి :

వసంత నవరాత్రులు అని కూడా గుర్తించబడే బసంత నవరాత్రి, వసంత ఋతువులో (మార్చి-ఏప్రిల్) తొమ్మిది రూపాల శక్తి మాతని (దేవీ మాత) ఆరాధించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగ.

దానిని చైత్ర నవరాత్రులని కూడా గుర్తిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులని కూడా అంటారు.

2. గుప్త నవరాత్రి :

ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో (జూన్-జులై), తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవిమాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగగా గుర్తిస్తారు.

ఆషాఢ శుక్లపక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం) గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.

3. శరన్నవరాత్రులు :

అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. దీనిని టూకీగా, మహా నవరాత్రి (గొప్ప నవరాత్రి) అని అంటారు, ఈ ఉత్సవాన్ని అశ్విన మాసంలో జరుపుకుంటారు.

శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను, శరద్ ఋతువులో (శీతాకాలం మొదట్లో అంటే, సెప్టెంబరు-అక్టోబరు) జరుపుకుంటారు.

4. పౌష్య నవరాత్రి :

పౌష్య నవరాత్రి అనేది తొమ్మిది రూపాల శక్తి మాతను (దేవీ మాత) పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజులు, దీనిని పుష్య మాసంలో (డిసెంబరు-జనవరి) వచ్చే పౌష్య నవరాత్రి అంటారు.

పౌష్య శుక్ల పక్షంలో (చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలంలో), పౌష్య నవరాత్రులు జరుపుకుంటారు.

5. మాఘ నవరాత్రి :

గుప్త నవరాత్రిగా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రిని, మాఘమాసంలో (జనవరి-ఫిబ్రవరి) తొమ్మిది రూపాలలో శక్తిని మాతను (దేవీ మాత) తొమ్మిది రాత్రులు ఆరాధించే పండుగగా గుర్తిస్తారు.

మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయంలో) జరుపుకుంటారు.

వసంత నవరాత్రి

ఈ పండుగను వసంత ఋతువులో (వేసవి కాలపు మొదలు) జరుపుకుంటారు (మార్చి-ఏప్రిల్).

ఈ పండుగను చైత్ర నవరాత్రులుగా కూడా గుర్తిస్తారు, ఎందుకంటే, ఇది చంద్రుని మాసమయిన చైత్రములో వస్తుంది.

వసంత నవరాత్రులకు సంబంధించిన మూలం వెనుక కథ

ఒకానొకప్పుడు, మహారాజైన ధ్రువసింధు వేటకు వెళ్ళినపుడు ఆయనను సింహం చంపివేసింది.

యువరాజు సుదర్శనుడికి రాజ్యాభిషేకం చేయడానికి సన్నాహాలు జరిగాయి.

కానీ, మహారాణి లీలావతికి తండ్రి, ఉజ్జాయినీ రాజ్యానికి రాజయిన యుధజిత్తు,, మహారాణి మనోరమకు తండ్రి, కళింగ రాజ్యానికి రాజయిన వీరసేనుడు తమ తమ మనవళ్ళ కోసం కోసల రాజ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కోరిక కలిగి ఉన్నారు.

వాళ్ళు ఒకరితో మరొకరు యుధ్ధం చేసారు. యుధ్ధంలో రాజు వీరసేనుడు మృతి చెందాడు.

మనోరమ యువరాజు సుదర్శనుడినీ, ఒక నపుంసకుడినీ తోడు తీసుకుని అడవిలోకి పారిపోయింది. వాళ్ళు ఋషి భరద్వాజుని ఆశ్రమంలో తలదాచుకున్నారు.

విజితుడయిన రాజు యుధజిత్తు, అప్పుడు కోసల రాజధాని అయిన అయోధ్యలో, తన మనుమడయిన శత్రుజిత్తుని పట్టాభిషిక్తుని చేసాడు.

అతను ఆ తరువాత, మనోరమను ఆమె కొడుకునూ వెతుక్కుంటూ బయలుదేరాడు. తనను రక్షణ కోరిన వారిని అప్పగించనని ఋషి సెలవిచ్చాడు.

యుధజిత్తు కోపోద్రిక్తుడయ్యాడు. అతను ఋషిపై దాడి చేద్దామని అనుకున్నాడు.

కానీ, అతని మంత్రి అతనికి ఋషి యొక్క వ్యాఖ్యకు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. యుధజిత్తు రాజధానికి వెనుదిరిగాడు.

యువరాజు సుదర్శనుడిని అదృష్టదేవత వరించింది. తపస్వి కుమారుడు ఒక రోజు వచ్చి, నపుంసకుడిని తన సంస్కృత నామమయిన క్లీబ అన్న పేరుతో పిలిచాడు.

యువరాజు మొదటి శబ్దమయిన క్లిను పట్టుకుని దానిని క్లీం అని సంబోధించడం మొదలు పెట్టాడు.

ఆ అక్షరం చాలా శక్తిమంతమయిన, పవిత్రమయిన మంత్రం. అది దేవీ మాతకు బీజాక్షరం (మూల అక్షరం).

యువరాజు ఈ అక్షరాన్ని మాటిమాటికీ పలకడం వలన అతనికి మనశ్శాంతి, దేవి మాత యొక్క అనుగ్రహం కలిగింది.

దేవి అతనికి దర్శనం ఇచ్చి, ఆశీర్వదించి, అతనికి దైవికమైన ఆయుధాలను, ఎప్పటికీ తరిగిపోని అంబులపొదినీ వరంగా ఇచ్చింది.

వారణాసి యొక్క రాజదూతలు ఋషి ఆశ్రమం గుండా పయనించినపుడు ఉదాత్తమైన యువరాజు సుదర్శనుడిని చూసి, అతనిని వారణాసి రాజు కుమార్తె అయిన యువరాణి శశికళకు వరుడిగా ప్రతిపాదించారు.

యువరాణి తన వరుడిని ఎన్నుకునే స్వయంవరం ఏర్పాటు చెయ్యబడింది. శశికళ వెంటనే సుదర్శనుడిని వరించింది.

వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. ఆ పెళ్ళిలోనే ఉన్న రాజు యుధజిత్తు, వారణాసి రాజుతో యుధ్ధం చేయడం మొదలు పెట్టాడు.

దేవీ మాత సుదర్శనుడునీ అతని మామనీ రక్షించింది. యుధజిత్తు ఆమెను హేళన చేసాడు, దానితో వెనువెంటనే దేవీ మాత అతనినీ అతని సైన్యాన్ని బూడిదగా మార్చింది.

అప్పుడు సుదర్శనుడు, తన భార్య, మామతో కలిసి దేవిని స్తుతించాడు.

దేవి అతి ప్రసన్నురాలై, వారికి తనని హోమంతో ఇతర సాధనాలతో వసంత నవరాత్రులపుడు పూజించమని ఆదేశించింది. తరువాత ఆమె మాయమయ్యింది.

యువరాజు సుదర్శనుడు, శశికళ ఋషి భరద్వాజుని ఆశ్రమానికి వెనుదిరిగి వచ్చారు.

ఋషిపుంగవుడు వారిని ఆశీర్వదించి సుదర్శనుడిని కోసల రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు.

సుదర్శనుడు, శశికళ ఇంకా ఆమె తండ్రి అయిన వారణాసి రాజు తుచ తప్పకుండా దేవి మాత యొక్క ఆదేశాలను పాటించి ఆమెకు వసంత నవరాత్రులలో అద్భుతరీతిలో పూజలు జరిపారు.

సుదర్శనుడి వారసులయిన, శ్రీ రామ లక్ష్మణులు కూడా శరన్నవరాత్రులలో, దేవిని పూజించి, ఆమె సహాయంతో సీతను తిరిగి తేగలిగారు.

శరద్ నవరాత్రి

చంద్రమాసమయిన అశ్వయుజ/అశ్విన మాసం యొక్క ప్రకాశవంతమయిన సగంలోని మొదటి రోజున మొదలయి, చివరి రోజున అంతమవుతుంది.

ధౌమ్య వాచనుడి ప్రకారం, ‘నవరాత్రి పండుగ అశ్విన మాసంలోని ప్రకాశవంతమయిన పక్షంలో ప్రతిపాదం అను క్రమంలో, నవమి పూర్తయ్యేదాకా జరుపుకుంటారు’.

2010లో నవరాత్రులు 2010 అక్టోబరు 8న మొదలై, 2010 అక్టోబరు 16న అంతమవుతాయి. విజయదశమి 2010 అక్టోబరు 17న జరుపుకుంటారు.

దేవీ రూపాలు

నవరాత్రులలో తొమ్మిది రూపాలలో శక్తిని ఆరాధిస్తారు. స్థలసంప్రదాయాన్ని బట్టి దేవతల రూపాలు మారుతూ ఉంటాయి.

  • దుర్గ, దుర్గమమైన దేవత
  • భద్రకాళి
  • అంబ లేదా జగదంబ, విశ్వానికి మాత
  • అన్నపూర్ణ, సమృధ్ధిగా ధాన్యాన్ని (అన్నం) ప్రసాదించే తల్లి (పూర్ణ: వైయక్తికంగా ఉపయోగిస్తారు)
  • సర్వమంగళ, అందరికీ (సర్వ) మంచి (మంగళ) చేకూర్చే తల్లి
  • భైరవి
  • చంద్రిక లేదా చండి
  • లలిత
  • భవాని
  • మూకాంబిక

ఆచారకర్మలు

చంద్రమాసమయిన అశ్విన మాసంలోని ప్రకాశవంతమయిన పక్షంలోని మొదటి రోజున (ప్రతిపాదం) నవరాత్రులు మొదలవుతాయి.

అక్టోబరు మాసం మొదలయినపుడు ప్రతి సంవత్సరం తొమ్మిది రాత్రులు ఈ పండుగను జరుపుకుంటారు; చంద్ర పంచాంగం ప్రకారం తేదీలను నిర్ణయించినా కూడా ఈ పండుగను ఒక రోజు అటూ ఇటూగా జరుపుకోవచ్చు.

నవరాత్రులను వివిధ పధ్ధతులతో దేశమంతా ఉత్సవంగా జరుపుకుంటారు.

ఉత్తర భారతదేశంలో మూడు నవరాత్రులనూ అత్యంత ఆదరణతో, తొమ్మిది రోజులూ ఉపవాసం ఉంటూ, దేవీ మాతను వివిధ రూపాలలో పూజిస్తూ జరుపుకుంటారు.

చైత్ర మాసంలో జరుపుకునే నవరాత్రి శ్రీ రామ నవమితోనూ, శరద్ నవరాత్రి దుర్గా పూజతోనూ, దసరాతోనూ పరాకాష్ఠకు చేరుకుంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ దసరా ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి చాలా ప్రఖ్యాతి గాంచింది.

తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజగా జరుపుకునే ఉత్సవంలో, చివరి నాలుగు రోజులూ ప్రత్యేకమైన నాటకీయ రూపం సంతరించుకుంటాయి.

రాష్ట్రంలో ఇది అన్నింటికన్న పెద్ద ఉత్సవం. అద్భుతమైన కళానైపుణ్యంతో, అలంకరించబడిన బంక మన్నుతో చేయబడిన నిలువెత్తు దుర్గాదేవి విగ్రహాలు, ఆమె మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో గుళ్ళలోనూ ఇతర ప్రదేశాలలోనూ ఏర్పాటు చేస్తారు.

ఈ విగ్రహాలకు అయిదు రోజులు పూజలు నిర్వహించి, అయిదో రోజున నదిలో నిమజ్జనం చేస్తారు.

పశ్చిమ భారతదేశంలో, ప్రత్యేకించి గుజరాత్ రాష్ట్రంలో, నవరాత్రి ప్రఖ్యాతి గాంచిన గార్బా, డాండియా-రాస్ నృత్యాలతో వేడుకగా జరుపుకుంటారు.

గత కొద్ది సంవత్సరాలుగా, గుజరాత్‌లో గుజరాత్ ప్రభుత్వం “నవరాత్రి పండుగ ఉత్సవాలను” నవరాత్రి పండుగ యొక్క తొమ్మిది రోజులలో క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.

ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో పాలు పంచుకోవడానికి గుజరాత్ నలుమూలల నుండి, ఇంకా విదేశాల నుండి కూడా ప్రజలు తరలి వస్తారు.

ఇది భారతదేశమంతా కూడా చాలా ప్రఖ్యాతి గాంచింది, ఇంకా ప్రపంచవ్యాప్తంగా, UK, USAలతో సహా అన్ని దేశాలలో కూడా ఇది చాలా జనాకర్షకమైన ఉత్సవం.

గోవాలో, జాత్ర నవరాత్రి అపుడు మొదలవుతుంది, అంత్రుజ్ (పోండా) మొత్తం కూడా చాలా వైభవంగా అలంకరిస్తారు. సరస్వత్ ఆలయాలను అందంగా అలంకరించి, విగ్రహాలను పూజకు బయటకు తీస్తారు.

విగ్రహాలకు దుస్తులు తొడిగి పూలు, గంధం, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు.

భక్తులు నవరాత్రి పండుగలో ప్రత్యేక దర్శనానికి వస్తారు, భక్తుడు ఎక్కువగా ఎదురు చూసేది కౌల్ ప్రసాదము, అది దేవుళ్ళు దేవతల నుండి ఇచ్చిన ప్రసాదంగా భావిస్తారు.

దేవీ విగ్రహాలను పూలతో ప్రకాశవంతమైన రంగులతో అలంకరిస్తారు, భక్తులు లేదా పూజారులు పూలను మార్చే పని కూడా చేయకుండా పూజిస్తారు.

ఉత్సవపు రాత్రి పూర్తి అయినపుడు, పూలను ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారు.

దక్షిణ భారతదేశంలో, వేదికలు నిర్మించి, విగ్రహాలను వాటి పై ఉంచుతారు.

దీనిని గోలు అంటారు. భారతదేశంలోని, మహారాష్ట్రలోని, నావి ముంబైలోని, నేరుల్‌లోని ఒక గృహంలో తమిళనాడు రీతిలో ప్రదర్శించిన ఉదాహరణాత్మకమైన గోలు యొక్క చిత్రాలను ఈ ప్రక్కన చూడండి.

కేరళలో, మూడు రోజులు: నవరాత్రి యొక్క అష్టమి, నవమి, విజయ దశమి రోజులను సరస్వతీ పూజగా జరుపుకుంటారు అందులో, పుస్తకాలకు పూజ నిర్వహిస్తారు.

పుస్తకాలను పూజ కోసం అష్టమి రోజున తమ సొంత ఇళ్ళలోనూ, సంప్రదాయికమైన చంటిపిల్లల బడులలోనూ, ఆలయాలలోనూ ఉంచుతారు.

సరస్వతిని పూజించాక, విజయ దశమి రోజున పుస్తకాలను సంప్రదాయబధ్ధంగా చదవడానికీ, రాయడానికీ బయటికి తీస్తారు.

విజయదశమి ని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు, దానిని విద్యారంభం అంటారు.

కేరళలో ఈ రోజు కొన్ని వేలమంది చంటిపిల్లలను అక్షరాల ప్రపంచంలోకి ఆవాహన చేస్తారు.

మూడు వివిధ అంశాల మహోన్నతమైన దేవినీ లేదా దేవతలనూ ఆరాధించడానికి నవరాత్రిని మూడు రోజుల సమూహంగా విభజిస్తారు.

మొదటి మూడు రోజులు

దేవిని మనలో ఉన్న అశుధ్ధాలను నాశనం చేయడం కోసం, ఒక ఆధ్యాత్మిక శక్తిగా వేరు చేస్తారు, ఆ శక్తిని దుర్గ అనీ, కాళి అనీ గుర్తిస్తారు.

రెండవ మూడు రోజులు

మాతను ఆధ్యాత్మిక సంపదను ఒసగే లక్ష్మీ మాతగా ఆరాధిస్తారు. లక్ష్మీ మాత సంపదకు దేవత, ఆమెను తన భక్తులకు తరిగిపోని సంపదను ఇచ్చే శక్తిగల దేవతగా భావిస్తారు.

చివరి మూడు రోజులు

చివరి మూడు రోజులను చదువుల తల్లి అయిన సరస్వతిని పూజించడంలో గడుపుతారు.

జీవితంలో అన్ని రంగాలలోనూ విజయం సాధించడానికి, ఆస్తికులు మూడు రకాల దైవిక స్త్రీత్వం యొక్క ఆశీర్వాదం పొందడం కోసం పూజిస్తారు, అందుకే తొమ్మిది రాత్రుల పూజ చేస్తారు.

సంప్రదాయబధ్ధంగా ఎనిమిదవ రోజు దుర్గాష్టమి చేస్తారు, అది బెంగాల్‌లో చాలా ముఖ్యమైన రోజు.

దక్షిణ భారతదేశంలోని కొన్ని భాగాలలో, సరస్వతి పూజ తొమ్మిదవ రోజు జరుపుకుంటారు.

దక్షిణ భారతదేశంలోని చాలా భాగాలలో మహానవమి (తొమ్మిదవ) రోజున ఆయుధపూజ చాలా ఆడంబరంగా జరుపుకుంటారు.

ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, అన్నిరకాల పరికరాలు, ఉపకరాలు, యంత్రాలు, స్వయంచాలిత ఉపకరాలను అలంకరించి, దేవీ పూజతో పాటు వాటిని కూడా పూజిస్తారు.

మరుసటి రోజు నుండి పని తిరిగి తాజాగా మొదలవుతుంది, అంటే పదవరోజు, దానిని ‘విజయదశమి’గా జరుపుకుంటారు.

దక్షిణ భారతదేశంలోని చాలా మంది అధ్యాపకులు/విద్యాలయాలు ఆరు సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలకు పాథాలు నేర్పే పాఠశాలలలో ఆ రోజు నుండి పిల్లలకు పాఠాలు నేర్పడం మొదలెడతారు.

ఉత్తర భారతదేశంలో రామ్‌లీల యొక్క పరాకాష్ఠను దసరా సమయంలో, రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మలను, ‘విజయదశమి’ రోజున చెడు శక్తుల పై మంచి (రాముడు) సాధించిన విజయానికి సూచకంగా, వేడుకగా తగలబెట్టి ఉత్సవంగా జరుపుకుంటారు.

నవరాత్రి సమయంలో, కొంతమంది దుర్గామాత భక్తులు ఉపవాసాలు ఉండి, ఆరోగ్యము, సంపదలను సంరక్షించమని ప్రార్థనలు జరుపుతారు.

కొత్త పనులు మొదలు పెట్టడానికి, అంతఃశోధనకు, ప్రక్షాళనకు నవరాత్రిని సంప్రదాయికంగా చాలా శుభప్రథమైన, ఆధ్యాత్మికమైన సమయంగా భావిస్తారు.

మతపరమైన ఈ ఆచారం పాటించే సమయంలో, ఒక శుధ్ధి చేయబడిన ప్రదేశంలో ఒక కుండను (ఘటస్థాపన) ఉంచుతారు.

ఆ కుండలో తొమ్మిది రోజులు ఒక దీపం వెలిగించి ఉంచుతారు.

కుండ విశ్వానికి ప్రతీక. నిరంతరంగా వెలిగే దీపం మనం పూజించే దేదీప్యమానమైన ఆదిశక్తి అయిన దుర్గా దేవిని పూజించడానికి మాధ్యమం. నవరాత్రి సమయంలో శ్రీ దుర్గాదేవి యొక్క శక్తి వాతావరణంలో చాలా సక్రియాత్మకంగా ఉంటుంది.

చాలా పెద్ద సంఖ్యలో భారతీయ సముదాయాలు నవరాత్రి పండుగను జరుపుకుంటాయి. దేవీ మాత తొమ్మిది రూపాలలో కనిపిస్తుందని నమ్ముతారు, అందుకని ప్రతి రూపాన్ని ఒక్కో రోజు పూజిస్తారు.

ఈ తొమ్మిది రూపాలు దేవి మనల్ని ప్రభావితం చేసే వివిధ గుణాలను ప్రతిబింబిస్తాయి.

దేవి మాహాత్మ్యము, దుష్టశక్తుల ప్రభావం నుండి దేవిని రక్షణ కోరడం కోసం ఉద్దేశించిన ఇతర స్తోత్రాలతో దేవిని స్తుతిస్తారు.

ఎనిమిదవ రోజు లేదా తొమ్మిదవ రోజు, రజస్వల కాని బాలికలకు కన్యపూజను వేడుకగా నిర్వహిస్తారు.

దక్షిణ భారతదేశంలో ఆచరణలు…

1 శైలపుత్రి : దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక.

శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి.

పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు.

ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి.

ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

2. బ్రహ్మచారిణి : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది.

ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి.

ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

3. చంద్రఘంట : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం.

శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.

4. కూష్మాండ: నాలుగవ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి.

ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

5. స్కందమాత : అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి.

స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు.

ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది.

తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

6. కాత్యాయని : దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు.

అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది.

మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు.

మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు.

ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

7. కాళరాత్రి : దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు.

ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

8. మహాగౌరి : ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది.

ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు.

దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

9. సిద్ధిధాత్రి : దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది.

పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.

నవరాత్రులు

  • 1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి – శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి
  • 2వ రోజు – ఆశ్వయుజ విదియ – శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
  • 3వ రోజు – ఆశ్వయుజ తదియ – శ్రీ గాయత్రి దేవి
  • 4వ రోజు – ఆశ్వయుజ చవితి – శ్రీ అన్నపూర్ణా దేవి
  • 5వ రోజు – ఆశ్వయుజ పంచమి – శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి – లలిథ పంచమి
  • 6వ రోజు – ఆశ్వయుజ షష్టి – శ్రీ మహా లక్ష్మీ దేవి – మహాషష్టి
  • 7వ రోజు – ఆశ్వయుజ సప్తమి – శ్రీ మహా సరస్వతీ దేవి – మహా సప్తమి
  • 8వ రోజు – ఆశ్వయుజ అష్టమి – శ్రీ దుర్గా దేవి – దుర్గాష్టమి
  • 9వ రోజు – ఆశ్వయుజ మహానవమి – శ్రీ మహిషాసురమర్దిని – మహార్ణవమి
  • 10వ రోజు – ఆశ్వయుజ దసమి – శ్రీ రాజరాజేశ్వరి – విజయదసమి

ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం.

అందుకనే ‘దేవీనవరాత్రులు ‘ అని పిలవ బడుచున్నవి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి.

గోమయంతో(ఆవు పేడతో) నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి.

పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరిక పోచలు) తయారుగా ఉంచుకోవాలి.

పూజా విధానము: ఆ తరువాత తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని, ఆసనం పైన వేసి, లేని వారు (పీట మీద) తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖం గాని కూర్చుండ వలెను.

ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువునూ, పరమాత్మను ప్రార్థించి, పది నిమషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహా సంకల్పం చెప్పవలెను. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను.

ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెప్పవలెను. ఆతరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తొమ్మిది రోజులు (నవ రాత్రి) గాని లేదా ఏడు రోజులు గాని హీన పక్షం మూడు రోజులు కాని లేదా ఒక్క రాత్రి దీక్షగాని శ్క్యానుసారము దీక్ష చేయవలెను.

పూజాకాలములో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలెను. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబగళ్ళు వెలుగవలెను.

ఆయుధ పూజ: పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి, అగ్నాతవాసము చేసినారు.

వర్రి అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాండీవమును దించి కౌరవులతో యుధము చేయటముతో ముగిసినది.

విజయదసమి నాడు వారి అగ్నాతవాసము యొక్క గడువుముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున సమి వృక్షనికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.

రాజులకు ఈ నవమి నాదు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధ పూజగా చేయబదుతున్నది.

ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనములు తానెక్కిన వాహనములు గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను.

అపరాజితా శమీపూజ: శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను.

అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను.

Recent

- Advertisment -spot_img