– సందిగ్ధంలో రాజకీయ భవితవ్యం
– కొంపముంచిన నోటిదురుసు
– కోపంగానే బీఆర్ఎస్ అధిష్ఠానం
– మల్కాజిగిరి టికెట్ డౌటే?
– ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్న గులాబీ బాస్
– ఇతరపార్టీల నుంచీ నో ఇన్విటేషన్స్
– కేటీఆర్ కోసం వెయిట్ చేస్తున్న మైనంపల్లి
– కొడుకుకోసం నోరు జారితే మొదటికే మోసం
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఏకాకిగా మారిపోయారు. నోటి దురుసుతనమే ఆయన కొంప ముంచింది. మైనంపల్లి తీరుపట్ల గులాబీ బాస్ కేసీఆర్ ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఆయనను పక్కకుపెట్టి శంభీపూర్ రాజు లేదంటే మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలో దించేందుకు ఉన్న అవకాశాలను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దీంతో మైనంపల్లికి చిక్కులు తప్పేలా లేవు. ఆయన రాజకీయభవిష్యత్ సందిగ్ధంలో పడిపోయింది. కేవలం కుమారుడి టికెట్ కోసం మైనంపల్లి బీఆర్ఎస్ పై నోరు పారేసుకున్నారు. మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేస్తూ వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అయినప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లికి అవకాశం ఇచ్చారు. మైనంపల్లి మాత్రం శాంతించలేదు. తాను ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానంటూ ప్రకటించారు. ఈ కామెంట్స్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను పక్కకు పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దారులన్నీ క్లోజ్..
మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి ఒకవేళ బయటకు వస్తు ఒంటరిగా మారక తప్పదు. ఇతర పార్టీల నుంచి కూడా ఆయనకు పెద్దగా ఆహ్వానాలు లేవు. గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మీద కూడా మైనంపల్లి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలను కొట్టించిన చరిత్ర కూడా ఉన్నది. దీంతో మైనంపల్లిని తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా లేవు. కుమారుడి టికెట్ కోసం మైనంపల్లి నోరుజారారు. మరోవైపు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్తే.. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు లేవు. అధికార వర్గం సహకరించదు. ఆయన శతృవులంతా ఏకమయ్యే అవకాశం ఉంది. వెరసి మైనంపల్లికి చిక్కులు తప్పవు.
కేటీఆర్ పైనే ఆశ..
ఇక మైనంపల్లి హన్మంతరావు ప్రస్తుతం మంత్రి కేటీఆర్ మీదే ఆశలు పెట్టుకున్నారు. కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత తనకు ఏదైనా భరోసా దక్కుతుందని భావిస్తున్నారు. మరి కేటీఆర్ విదేశాల నుంచి వస్తే .. మైనంపల్లిని క్షమిస్తారా? అన్నది వేచి చూడాలి. మొదటి నుంచి వివాదాస్పదుడిగా ఉన్న మైనంపల్లి.. కేటీఆర్ ద్వారానే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. తన కుమారుడికి సైతం ఈ దఫా మెదక్ అసెంబ్లీ టికెట్ తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. బీఆర్ఎస్ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. పక్క రాష్ట్రంలో తిరుమల పుణ్యక్షేత్రంలో సొంత పార్టీ మీదే విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం మైనంపల్లికి చిక్కులు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పక్కకు పెట్టడం.. మరోవైపు ఇతర పార్టీలు కూడా పట్టించుకోకపోవడంతో మైనంపల్లి ఒంటిరిగా మారిపోయారు. ఆయన దూకుడుగా ఉంటున్నానని భావించి నోటికి పనిచెప్పారు. ఈ వ్యవహారమే ఇప్పుడు కొంపముంచింది.